నిమ్మకాయల ధరహాసంతో వినియోగదారుల కళ్లు బైర్లు!
వత్సవాయి: ఉమ్మడి జిల్లాలో భానుడు సెగలు కక్కుతున్నాడు. ఎండ తీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అందరూ చల్లని పానీయాల వైపు చూస్తున్నారు. అందులో నిమ్మరసానికి ప్రథమ స్థానం ఉంటుంది. అయితే ఆ నిమ్మ ధరలు చూస్తే.. అమ్మో అనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎక్కి కూర్చొంది. ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకాయ ధర ఒకటి పది రూపాయల వరకు కాయ సైజును బట్టి అమ్ముతున్నారు. అంటే డజను కాయలు దాదాపు రూ. 100 నుంచి రూ. 120కి విక్రయిస్తున్నారు. డిసెంబర్ వరకు కాయ రెండు రూపాయలు వరకు ఉన్న ధర.. వేసవికాలం పుణ్యమా అని పదికి చేరింది.


