ఎ.కొండూరు: మండల పరిధిలోని చైతన్య నగర్ తండా, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ జనగణనపై జిల్లా డీఆర్డీఏ, డ్వామా పీడీ, మండల తహసీల్దార్, ఎంపీడీఓలతో బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ జనగణనలో ఎ.కొండూరు మండలాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని వీవోఏలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు మండల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డిజిటల్ జనగణనను ఫోన్లో ఎలా నమోదు చేయాలో కలెక్టర్ తన ఫోన్లో చేసి చూపించారు. ప్రజలు ఎవరికి వారు తమ సెల్ఫోన్లో డిజిటల్ జనగణన నమోదు చేసుకోవచ్చన్నారు. డిజిటల్ జనగణనపై అధికారులు ప్రతి రోజు సమీక్ష జరపాలని, ఈ కార్యక్రమం వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులపై ఆయన ఆరా తీశారు. పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ప్రతిరోజు కూలీలకు పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చైతన్యనగర్, బీసీ కాలనీకి త్వరితగతిన కృష్ణా నీరు సరఫరా జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆ కాలనీకి అవసరమైన మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. అనంతరం మండల పరిషత్ పాఠశాలలో కొబ్బరి మొక్కను నాటారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి నాంచారయ్య, డ్వామా పీడీ ఎ.రాము, ఆర్డబ్లూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, ఆర్డీవో కుమార్ ఈఈ రామకృష్ణ, ఇరిగేషన్ డీఈ ఉమాశంకర్, తహసీల్దార్ ఉదయ్భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ


