గౌరంపాలెం(విస్సన్నపేట): ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మంచిదని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మండలంలోని తాతకుంట్ల పంచాయతీ గౌరంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికారిత సంస్థ ఆధ్వర్యంలో లక్ష్మి అనే మహిళా రైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంటలను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. సహజంగా పండించిన కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు తినటం వలన మీ ఆరోగ్యం, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపాలన్నారు. తక్కువ ఖర్చుతో ఇంట్లో కూరగాయలు పండించుకోవటం వలన డబ్బులు ఆదా అవుతాయని, రసాయనాలు వాడని మంచి కూరగాయలు లభిస్తాయన్నారు. అనంతరం మండలంలోని చండ్రుపట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అవసరమైన గన్నీబ్యాగ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎ.కుమార్, తహసీల్దార్ కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీఓ చేకు చిన్నరాట్నాలు, ఏఓ రాజ్యలక్ష్మి, పీడీఎస్ డీటీ శివనాగరాజు, ప్రకృతి వ్యవసాయం ఇన్చార్జి శ్రీనివాసరావు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.


