నాగాయలంక: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పునఃనిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా త్వరితగతిన ప్రారంభించాలనే సంకల్పంతో బుధవారం ఆలయ ముఖ మండపంలో చండీహోమం నిర్వహించారు. షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని తొలుత ఆలయంలో స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. తదుపరి విజయవాడ నుంచి వచ్చిన జూపూడి యశ్వంత్శర్మ నేతృత్వంలో పండితుల బృందం హోమం నిర్వహించారు. చెన్ను లక్ష్మణరావు, అద్దేప్తి శ్రీనివాసరావు, పూషడపు నిరంజనరావు జంటలతో పాటు మరో రెండు జంటలు పూజలో పీటలపై కూర్చున్నారు. ఆలయ పునఃనిర్మాణం కోసం రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ రూ.కోటిన్నర అంచనా వ్యయంతో సీజీఎఫ్ నిధులు రూ.కోటి మంజూరు చేయగా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కింద రూ.50లక్షలు సమకూర్చారు. అయినా పనులు ముందుకు సాగని నేపథ్యంతో చండీహోమం తలపెట్లినట్లు కమిటీ సభ్యులు చెప్పారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ నిజామాబాద్కు చెందిన భక్తులు రూ. 17లక్షల విలువైన కాసుల హారాన్ని బుధవారం కానుకగా సమర్పించారు. నిజామాబాద్లోని ద్వారకానగర్కు చెందిన తోడుపునూరి శ్రీనివాస్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు 107.500 గ్రాముల బంగారం, పచ్చలు, ఎరుపు రంగు రాళ్లతో తయారు చేయించిన కాసుల హారాన్ని ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం దాతలకు వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
విస్సన్నపేట: రపభుత్వ పాఠశాలల్లో గతేడాది కంటే ఈసారి 20శాతం విద్యార్థుల అడ్మిషన్లు సంఖ్య పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈఓ ఎల్. చంద్రకళ అన్నారు. మండలంలో కొండపర్వ ఎంపీపీ(హెచ్డబ్ల్యూ) పాఠశాలను బుధవారం సందర్శించారు. ఆ పాఠశాలలో కొత్తగా 12 మంది విద్యార్థులకు డీఈఓ చేతుల మీదుగా అడ్మి షన్లు ఇచ్చారు. మండలంలోని నరసాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 28 మంది విద్యార్థులకు అడ్మిషన్లు, విస్సన్నపేట జిల్లాపరిషత్ హైస్కూల్లో 45 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఎంఈఓ–1 శంకరరావు ఆయా పాఠశాలల హెచ్ఎం, టీచర్లు పాల్గొన్నారు.


