గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని పీఆర్టీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నవాబ్ జానీ డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నవాబ్ జానీ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సోల రాఘవరాజు మాట్లాడుతూ.. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను గ్రేడ్–1 హెచ్ఎంలుగా పరిగణించాలని, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, కేజీబీవీ వారికి ఎంటీఎస్ వర్తింప చేయాలని, సీఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇన్ సర్వీస్ వ్యాయామ ఉపాధ్యాయులకు బీపీఈడీ, ఎంపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. జిల్లా జేఏసీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలను జిల్లా కలెక్టర్ల పరిధిలో చేపట్టాలని ఏపీ జేఏసీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కోరారు. ఏపీ సెక్రటేరియట్ డెప్యూటీ సెక్రటరీ డాక్టర్. బి.అప్పారావు, ఎన్టీఆర్ జిల్లా సీఆర్టీల సంఘం అధ్యక్షుడు గోపాల్ ధర్నాకు సంఘీభావం తెలిపారు.


