నందిగామరూరల్: వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో పల్టీ కొట్టిన ఘటనలో మహిళ మృతి చెందగా మరో ముగ్గురు గాయాలైన ఘటన నందిగామ మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన 20 మంది వ్యవ్యసాయ కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామశివారులో మిర్చి కోతకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం సమయంలో స్వగ్రామం వస్తుండగా రామిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని ఎన్ఎస్పీ కాల్వ మలుపు వద్ద టైరు పేలి ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీలను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన ఎస్.నాగమణి (42)కి తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వై.వి.ఎల్. నాయుడు తెలిపారు.


