విజయవాడ కల్చరల్: శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సద్గురు త్యాగ రాజ స్వామి జయంతి ఉత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురు కళాకారులు త్యాగరాజస్వామికి స్వరనీరాజనాలు అర్పించారు. అన్త్వతమణి గాత్ర కచ్చేరీ శ్రావ్యంగా సాగింది. ఓరుగంటి సాయి వశిష్ట, కె.దుర్గాగాయత్రి, కె.లక్ష్మీవెంకట సత్యవల్లి, వావిలాల వేంకట రఘునామ ప్రణద, బొమ్మరాజు రఘనాథరావు, ఎం.చంద్రశేఖర్, కస్తూరి గోపాలరావు, కందుర్తి లక్ష్మీనరసమ్మ, తుషార పూర్ణవల్లి తదితరులు త్యాగరాజ స్వామి కృతులను వీనుల విందుగా ఆలపంచారు. సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఎన్.సీహెచ్.బుచ్చయ్యా చార్యులు త్యాగరాజ మార్గం అంశంగా ప్రసంగించారు. నందకుమార్, చావలి శ్రీనివాస్, కె.జగన్మోహిని, కందుల అనిల్కుమార్ వాద్య సహకారం అందించారు. వెడలెను కోదండపాణి, రామ నామము జన్మరక్షణ మంత్రము, ఇక కావలసినది ఏమి, రామ ననుబ్రోవరా తదితర కీర్తనలు అలరించాయి. వారం రోజులపాటు నిర్వహించే త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలను సంస్థ అధ్యక్షుడు బి.వి.ఎస్.ప్రకాష్ ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శి పోపూరి గౌరీనాథ్, ఉపాధ్యక్షుడు బి.హరిప్రసాద్, సభ్యులు గాయత్రీ గౌరీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


