‘అకాల’ దెబ్బకు
అకాల వర్షంతో రబీసాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న నేలవాలి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సోమవారం మధ్యాహ్నం సమయంలో తీవ్ర పెనుగాలులతో కూడిన వర్షం కురవడంతో కోతలు పూర్తయి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో 4,496హెక్టార్లలో రబీ మొక్కజొన్న సాగవుతుండగా, 31,790టన్నుల మొక్కజొన్నలు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అయితే ఇప్పటికే ఎనభైశాతం కోతలు పూర్తి కల్లాల్లో ఆరబోసి ఉండడంతో వర్షానికి తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు మండలాల్లో 250వరకు ఇటుక బట్టీలను నిర్వహిస్తుండగా వర్షం దెబ్బతో రూ.కోట్లల్లో నిర్వాహకులు నష్టపోయారు. అలాగే మామిడి కోతలు కోసే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లా హనుమాన్జంక్షన్లో మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి.
– జి.కొండూరు/హనుమాన్జంక్షన్ రూరల్


