పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందని వీఎంసీ అదనపు కమిషనర్(జనరల్) ఎ.రవీంద్రరావు అన్నారు. వీఎంసీ ప్రాంగణంలోని ఎస్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ అమలు చేస్తున్న ఎస్బీఐ ఎస్జీఎస్పీ (స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్) గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం లబ్ధిదారులకు శనివారం ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాల వల్ల మృతి చెందితే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక ఆలంబన ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి వారి వేతనాలు జమయ్యే ఎస్బీఐ బ్రాంచ్లో ఈ పథకం అమలులో ఉంటుందని, ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వీఎంసీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఐదుగురు పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక శానిటరీ మేసీ్త్ర, కుటుంబ సభ్యులకు వారి బీమా పరిహారపు చెక్కులు అందించారు. ఎస్బీఐ వీఎంసీ విజయవాడ వెస్ట్ ప్రాంతీయ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పథకం కింద రిటైర్మెంట్ వరకు బీమా రక్షణ ఉంటుందని, ఈ బీమా కవరేజ్ పూర్తి ఉచితంగా, ఎటువంటి ప్రీమియం లేకుండా అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఎంసీ అకౌంట్స్ ఆఫీ సర్ బి.ఎస్.ఎన్.మూర్తి, చీఫ్ మేనేజర్ (డిపాజిట్స్ – వీఏఎస్) ఎం.భాస్కర్ రావు, వీఎంసీ బ్రాంచ్ మేనేజర్ ఎస్.శివరాం పాల్గొన్నారు.


