నవమి వేడుకల అన్నదానం అనంతరం ఘటన వాంతులు, విరేచనాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిక బాధితులను పరామర్శించిన కలెక్టర్ లక్ష్మీశ
నందిగామ టౌన్: శ్రీరామ నవమి వేడుకల్లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వాంతులు, విరేచనాలతో పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్, ఇతర అధికారులు పరామర్శించారు. సేకరించిన సమాచారం మేరకు.. నందిగామ మండలం చందాపురం గ్రామంలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. భోజనం తిన్న వారిలో 28 మంది అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలతో శనివారం తెల్లవారుజామున నందిగామ పట్టణంలోని ఆస్పత్రిలో చేరారు. వారిలో 20 మంది డిశ్చార్జ్ కాగా మరో ఎనిమిది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీశ, వైద్యారోగ్య, ఫుడ్ సేఫ్టీ, తదితర శాఖల ఉన్నతాధికారులు శనివారం గ్రామానికి చేరుకున్నారు. భోజనాలు, శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. భోజనానంతరం ఆర్వో నీటిని తాగినట్లు తెలిసిందని, ఘటనకు కారణాలను తెలుసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. నీరు, భోజన శాంపిళ్లను ల్యాబ్లకు పంపామన్నారు. కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్వో ఇందుమతి, ఆర్డీవో పోశిబాబు, మున్సి పల్ కమిషనర్ లోవరాజు, తహసీల్దార్ సురేష్బాబు, సీఐ వైవిఎల్ నాయుడు, గ్రామ నాయకులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, బొగ్గవరపు రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.


