మచిలీపట్నంఅర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ రణభేరి 3.0లో భాగంగా కృష్ణా కలెక్టరేట్ ఎదుట ఏప్రిల్ ఒకటో తేదీన ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు ఆదివారం తెలిపారు. నిరాహార దీక్ష నోటీసును శనివారం రాత్రి డీఆర్వో చంద్రశేఖర్కు అంద జేసినట్లు పేర్కొన్నారు. పీఆర్సీ, డీఏ, బకాయిలు, మెమో 57 అమలు వంటి ఆర్థిక సమస్యల పరి ష్కారం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. 11వ పీఆర్సీ అమలు సమయంలో ఆర్థిక ప్రయోజనాలు సక్రమంగా అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ను నియమించలేదని విమర్శించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు 18 నెలలుగా గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లింపులు జరగకపోవడం ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోమారు ఉద్యమానికి దిగుతున్నామని వెల్లడించారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించి, 29 శాతం బేసిక్ రివిజన్ ప్రకటించాలన్నారు పెండింగ్ డీఏలు విడుదల చేయడం, ఉద్యోగులు – పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు స్పష్టమైన రోడ్మ్యాప్ ప్రకటించాలని చెప్పారు. కోవిడ్ సమయంలో మరణించిన పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి షౌకత్ హుస్సేన్, బి.కనకారావు, గౌరవాధ్యక్షుడు జె.లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శి కె.రంగనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వి.సత్యనారాయణ, కె.అర్జున్, సుబ్రహ్మణ్యం, పి.పాపయ్య, ఒ.వి.నాగేంద్రం, అడపా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


