● ఆకాల వర్షాలకు నష్టపోయినరైతులను ఆదుకోవాలి ● జేసీకి వినతి పత్రం అందజేసిన తన్నీరు నాగేశ్వరరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ డిమాండ్ చేశారు. తక్షణం మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 18వ తేదీన కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతిన్న రైతులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. దెబ్బతిన్న పంటల వివరాలను వెంటనే సేకరించాలన్నారు. నష్టపోయిన వరి, మామిడి, బొప్పాయి, అరటి రైతులను గుర్తించి నష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ నెల 18వ తేదీ కురిసిన వర్షాలకు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. వరిలో ధాన్యం రాలిపోయి వట్టి కంకులు మాత్రమే మిగిలాయన్నారు. పెనుగంచిప్రోలు మండలంలో గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు గ్రామాలలో 800 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లిందన్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిందని, పొలంలో కోయని కాయలు రాలిపోయాయని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు శివరాత్రి పృథ్వీరాజ్, భైరబోయిన బాబు తదితరులు పాల్గొన్నారు.


