వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుదీర్ఘ కాలంగా న్యాయవాదిగా పని చేస్తున్న శ్రీహరి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. నేషనల్ కాపు ఫెడరేషన్ పేరుతో కాపు ఉద్యమానికి అండగా నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ కార్యదర్శిగా పని చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో మద్య విమోచన ప్రచారానికి కృషి చేస్తూ ప్రత్యేకంగా మద్యానికి వ్యతిరేకంగా పత్రికను నిర్వహించారు. పాతబస్తీ అభివృద్ధి పోరాట సమితి పేరుతో ఈ ప్రాంత అభివృద్ధికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు న్యాయ వాదిగా సుదీర్ఘకాలం పని చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు నరహరిశెట్టి శ్రీహరి అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పలువురి నివాళి
శ్రీహరి మరణ వార్త తెలియగానే ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి వన్టౌన్లోని ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, కిలారు రోశయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్) అధినేత ఉమారెడ్డి రమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్, మహాదేవు అప్పాజీరావు, నరేంద్ర, కొనిజేటి రమేష్ నివాళులర్పించారు.


