
ఉద్యమం...ఉధృతం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ధర్నా చౌక్లో గత 12 రోజులుగా నిర్వహిస్తున్న పీహెచ్సీ వైద్యుల ఉద్యమం ఉధృతరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని వైద్యులు మాత్రమే రిలే దీక్షలు, నిరసనల్లో పాల్గొనగా, ఇప్పుడు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం పాల్గొనడంతో దీక్షా శిబిరం నినాదాలతో హోరెత్తుతోంది. మరోవైపు స్కిట్లు, పాటలతో యువ వైద్యులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీల్లో పనిచేసే 2700 మంది వైద్యులు విధులను బహిష్కరించినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించారు.
వైద్యులకు మద్దతుగా వైద్య సిబ్బంది
వైద్యులకు మద్దతుగా పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది సైతం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలియచేస్తున్నారు. అవసరమైతే తాము కూడా విధులు బహిష్కరించేందుకు సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు సెకండరీ హెల్త్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, టీచింగ్ వైద్యుల సంఘాలు సైతం ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు సైతం పెద్ద సంఖ్యలో వైద్యులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం మాత్రం మొండిపట్టు వీడటం లేదు.
ముఖ్యమైన డిమాండ్లు ఇవే...
ఇన్సర్వీసు కోటా పీజీ సీట్లు 20 శాతం 2030 వరకూ కల్పించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు భత్యం, టైమ్బాండ్ ఉద్యోగోన్నతులు, టైమ్ బాండ్ స్కేల్స్ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవీంద్రనాయక్, ఇతర నేతలు డాక్టర్ వినోద్కుమార్, డాక్టర్ జ్ఞానేష్లతో పాటు దాదాపు వెయ్యి మందికి పైగా వైద్యులు, వారి కుటుంబ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు.