
డిసెంబర్లో యోగా చాంపియన్షిప్ పోటీలు
మొగల్రాజపురం/పటమట:(విజయవాడ తూర్పు): డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో అనంతపురం జిల్లాలో 6వ యోగాసన చాంపియన్ షిప్ 2025–26 (సబ్ జూనియర్స్) రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. స్థానిక టీచర్స్ కాలనీలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి ఎంపికై న 10 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికలు హాజరవుతారని చెప్పారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు జనవరి 5, 6, 7, 8 తేదీల్లో మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు వెళతారని తెలిపారు. గత నెల 28, 29, 30 అక్టోబర్ 1 తేదీల్లో విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో జరిగిన 6వ జాతీయ యోగాసనా చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు. హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళా విభాగంలో నెల్లూరుకు చెందిన పి.ప్రసూనకు స్వర్ణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎ.సుజాతకు రజిత పతకం దక్కిందని చెప్పారు. 2032లో జరిగే కామన్వెల్త్ గేమ్స్, 2036లో జరిగే ఒలింపింక్ గేమ్స్లో ఏపీ నుంచి క్రీడాకారులను పంపి స్వర్ణ పతకాలు సాధించడమే లక్ష్యంగా తమ అసోసియేషన్ పనిచేస్తుందని వెల్లడించారు. ఏపీ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, మేనేజర్ బెనర్జీ పాల్గొన్నారు.
నేటి నుంచి యోగా పోటీలు...
ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు పోలీస్ నేషనల్ యోగాసన పోటీలు– 2025–26 అమరావతిలో విట్ యూనివర్శిటీలో జరుగుతాని వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ గేమ్స్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందులో యోగాసనా భారత్ , యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయనిర్ణేతలు, టెక్నికల్ ఆఫీషియల్స్ను పంపించి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.
యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వెంకట రామకృష్ణ ప్రసాద్