
బెజవాడలో మరో దారుణ హత్య?
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలో జరిగిన జంట హత్యల ఘటనను మరువక ముందే మధురానగర్ వంతెన వద్ద మరో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన అజిత్సింగ్నగర్ పీఎస్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. గవర్నర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఈ నెల 16వ తేదీన ఓ రౌడీషీటర్ రెచ్చిపోయి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హత్యచేసిన విషయం విదితమే. ఐదు రోజుల వ్యవధిలోనే మరో వ్యక్తి అదే విధంగా నడిరోడ్డుపై రక్తపు మడుగులో మృతిచెందాడు. వరుస ఘటనలతో ప్రజలు హడలిపోతున్నారు.
రెండు రోజుల్లో ఇంటికొస్తానని చెప్పి.. మృత్యుఒడిలోకి...
గుంటూరు జిల్లా మొగలాయిపాలెం గ్రామానికి చెందిన షేక్ సాధిక్ (28)కు నగరంలోని వాంబేకాలనీ ప్రాంతానికి చెందిన కరిష్మతో 2019లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అతను పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. భార్యతో విభేదాల కారణంగా కొన్నేళ్ల నుంచి ఆమెకు దూరంగా జీవిస్తున్నాడు. వారిద్దరూ విడాకులకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అతను గుంటూరులోని తల్లివద్దే ఉంటున్నాడు. ఈ నెల 16వ తేదీన విజయవాడ వెళ్లివస్తానని చెప్పి గుంటూరు నుంచి బయలుదేరాడు. సాధిక్ 19వ తేదీ తన తల్లి రిహానాకు ఫోను చేసి రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. అయితే 20వ తేదీ తెల్లవారుజామున రక్తపు మడుగుల్లో శవమై కనిపించాడు.
భార్య, అనుమానితులను విచారణ చేస్తున్న పోలీసులు
సాధిక్ భార్య కరిష్మతో పాటు ఘటన జరిగిన ప్రాంతంలో అనుమానితులుగా కనిపించిన గంజాయి బ్యాచ్ సభ్యులను కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. కరిష్మ తన భర్త అసలు ఇంటికే రాలేదని పోలీసులకు స్పష్టం చేసింది. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సాధిక్, కరిష్మల ఫోన్ డేటాలను కూడా సేకరిస్తున్నారు. సాధిక్ తల్లి రిహానా ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం ప్రభుత్వాస్పత్రికి తరలించామని, ఆ రిపోర్టు ఆధారంగా సాధిక్ హత్యకు కారణాలు తెలుసుకొని పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
గంజాయి బ్యాచ్ పనా? వివాహేతర సంబంధం కారణమా?
భార్యను కలుద్దామని నగరానికి వచ్చిన సాధిక్ వాంబేకాలనీలో ఉన్న తన భార్య కరిష్మను కలిశాడో లేదో తెలియడం లేదు. వాంబేకాలనీ నుంచి మధురానగర్ వైపు ఉన్న ట్రెండ్ సెట్ మార్గంలో అక్కడే బస్స్టాప్ వద్ద రెండు రోజుల నుంచి అతను తిరుగుతూ ఉన్నట్లు తెలిసింది. తమ కోడలు కరిష్మకు వివాహేతర సంబంధం ఉందని, వారే తన కొడుకును హతమార్చి ఉండొచ్చని సాధిక్ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. సాధిక్ మరణించిన సమయంలో అతని శరీరంపై దుస్తులు లేకపోవడం, అతను మధురానగర్ వంతెన వద్ద తల పగిలి తీవ్ర రక్తస్రావంలో పడిఉండటం వారి అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సాధిక్ బ్యాగులో గంజాయి కూడా పోలీసులకు లభించినట్లు తెలిసింది. గంజాయి మత్తులో గంజాయి బ్యాచ్ సభ్యులకు అతనికి ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? గంజాయి బ్యాచ్ సభ్యులు ఎవరైనా అతన్ని హత్య చేసి ఉంటారా? లేక ఏదైనా వాహనం ఢీకొని మరణించి ఉంటాడే అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
గంజాయి బ్యాచ్ సభ్యులు హత్య చేసి ఉంటారనే అనుమానాలు
భార్య వివాహేతర సంబంధంపై మృతుడి బంధువుల ఆరోపణ
మృతుడి భార్య, గంజాయి బ్యాచ్ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు