
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెకానిక్లు దుర్మరణం
ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హనుమాన్జంక్షన్కు చెందిన దాసరి ఫణివిక్రమ్ తన కారును మరమ్మతుల నిమిత్తం విజయవాడలోని మెకానిక్ నూతక్కి శ్రీనివాస్(37) వద్దకు ఆదివారం సాయంత్రం తీసుకువెళ్లారు. అయితే పాత కారు కావడంతో తన స్నేహితుడైన ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన మరో మెకానిక్ సర్పరాజ్ (30)ని పిలిపించాడు. ఇరువురు కలిసి అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేశారు. అనంతరం తెల్లవారుజాము వరకు కారులోనే విశ్రాంతి తీసుకుని ఉదయం ఫణివిక్రమ్తో కలిసి సర్పరాజ్, శ్రీనివాస్ కారులో హనుమాన్జంక్షన్ బయలుదేరారు. మార్గ మధ్యలో ఆత్కూరు ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అందరూ అందులో చిక్కుకుపోయారు. కారు నడుపుతున్న సర్పరాజ్, వెనుక సీట్లో కూర్చున్న శ్రీనివాస్కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఎడమ వైపు కూర్చున్న ఫణివిక్రమ్ మాత్రం గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆత్కూరు పోలీసులు క్రేన్ సాయంతో కారు డోర్లను తెరచి గాయపడిన ఫణివిక్రమ్ను పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. సర్పరాజ్, శ్రీనివాస్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారును అతివేగంగా నడపడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శ్రీనివాస్కు భార్య, ఒక కుమారుడు ఉండగా, సర్పరాజ్ మాత్రం అవివాహితుడిగా పోలీసులు పేర్కొన్నారు.
వలస కూలీల అనుమానాస్పద మృతి
నందివాడ: వలస కూలీలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెన్ననపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అసోంకు చెందిన బిశాల్ బసుమత్రి (25), జహర్లల్ దోయిమరి (36) వెన్ననపూడి గ్రామంలో ఓ ఆక్వా చెరువు వద్ద కాపలాదారులుగా ఉంటూ అక్కడే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం చెరువు వద్ద ఉన్న షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం.. పొగ బాగా కమ్ముకోవడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. వారి శరీరం కూడా సగం వరకూ కాలిపోయింది. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితిని బట్టి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఎవరైనా సిగరెట్ కాల్చి పడేయడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల శరీర భాగాలతో పాటు ఘటనా స్థలంలో ఉన్నటువంటి వస్తువులను మంగళగిరి ఆర్ఎఫ్ఎస్ ల్యాబ్కి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు
కృష్ణాజిల్లా ఆత్కూరు వద్ద ఘటన

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెకానిక్లు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెకానిక్లు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెకానిక్లు దుర్మరణం