
అంతులేని అఘాయిత్యాలపై ఆందోళన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కూటమి పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ కరువైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యాలను నిరసిస్తూ ‘సేవ్ ఉమెన్, సేవ్ ఆంధ్ర’ పేరుతో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ అంబేడ్కర్ స్మృతివనంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం వద్ద మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి తదితర మహిళా నేతలతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు.
పోలీసుల ఓవరాక్షన్..
అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించేందుకు వచ్చిన మహిళా ప్రతినిధులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. మంగళవారం సెలవు దినం లోపలికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో గేటు వద్ద వైఎస్సార్ సీపీ మహిళ విభాగం ప్రతినిధులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. టీడీపీ క్రూర మృగాల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆడ బిడ్డల కన్నీళ్లతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. గేటు వద్దే నిరసన తెలియజేస్తున్న వారిలో కొందరిని లోపలకు పంపి మిగిలిన వారిని గేటు వద్ద నిలిపివేశారు. లోపలికి వెళ్లిన వరుదు కల్యాణి, మేయర్, డెప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లను అంబేడ్కర్ విగ్రహం ముందువైపునకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పక్కనే ఉండి వినతి పత్రం అందజేయాలని హుకుం జారీ చేశారు. ఆ సమయంలో పోలీసులకు ప్రతినిధులకు వాగ్వాదం జరిగింది. ఎవరైనా ముందుకు వెళ్లి వినతి పత్రం ఇస్తారని, పక్కనుంచి ఎలా ఇస్తారని వరుదు కల్యాణి నిలదీశారు.
రెడ్బుక్ రాజ్యాంగం..
మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, నిరసన తెలిపేందుకు రాజ్యాంగ నిర్మాత విగ్రహం వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, తాము ప్రజాప్రతినిధులమని, తీవ్రవాదులం కాదన్నారు. తమ చేతుల్లో ఆయుధాలు లేవని పోలీసులు ఎందుకు అనుమతించడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత కల్పించడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళా విభాగం ప్రతినిధులు విజిత, త్రివేణి రెడ్డి, సుభాషిణి, వేముల బేబీరాణి, తోపుల వరలక్ష్మి, బండి పుణ్యశీల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
కూటమి ఆటవిక పాలనపై వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన
అంబేడ్కర్ స్మృతి వనంలోని విగ్రహానికి వినతి పత్రం సమర్పణ

అంతులేని అఘాయిత్యాలపై ఆందోళన