
నేడు కృష్ణానదిలో ఫ్లోటింగ్ యోగా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర–2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వద్ద కృష్ణా నదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డును కై వసం చేసుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్స్పై వెయ్యిమందితో కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాసనాలు వేస్తున్నట్లు చెప్పారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రపంచ రికార్డుగా నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. మెగా ఈవెంట్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగంతో ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్యం, మునిసిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మత్స్య తదితర శాఖలతో పాటు అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ), స్విమ్మర్ల అసోసియేషన్, యోగా శిక్షణ సంస్థలు వంటివి కూడా భాగస్వాములవుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు..
ఫ్లోటింగ్ యోగా నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, సుశిక్షితులైన బోట్ ఆపరేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. బోట్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారన్నారు. సమావేశంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రామత్లేహి, డీపీఆర్వో ఎస్వీ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన..
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఫ్లోటింగ్ యోగా కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం పరిశీలించారు. ప్రపంచ రికార్డ్ను సొంతం చేసుకునేలా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో యోగా ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొననున్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా భద్రత, ఇతర ఏర్పాట్లను చేయాలని అధికారులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. బారికేడింగ్, సీటింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చూడాలని సూచించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ప్రాంగణ అలంకరణ తదితరాలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఆయుష్ అధికారులు, ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ మేనేజర్ పి. కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ