
ఉర్వేళమ్మ ఉత్సవం.. సకల జనుల సంబరం
● మూడేళ్లకోసారి గ్రామదేవత ఉర్వేళమ్మ జాతర ● నూరు వసంతాలుగా వెల్లివిరుస్తున్న మత సామరస్యం ● ఉర్వేళమ్మ జాతరలో తొలి పూజలు ముస్లిం సాహెబ్కే ● హిందూ భక్తులతో మదార్ సాహెబ్ సంబరం
భావదేవరపల్లి(నాగాయలంక): నూరేళ్లుగా అచ్చమైన మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ గ్రామదేవత సంబరం. నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామంలో మూడేళ్లకు ఒకసారి నిర్వహించే గ్రామదేవత ఉర్వేళమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. జాతరకు ముందుగా పూర్వీకుల సంప్రదాయం రీత్యా మదార్ సాహెబ్ సంబరం జరపడం తప్పనిసరి. గ్రామంలో గుడారం, మదరా సాహెబ్ జెండా ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. వందేళ్ల క్రితం అప్పటి ఆలయ ధర్మకర్తలు భోగాది అప్పారాయుడు, మండలి వెంకటప్పయ్య, గ్రామపెద్దలు రాసిన ఇలియా (శాసనం) ప్రకారం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉర్వేళమ్మతో పాటు మదార్సాహెబ్ సంబరం మందుగా నిర్వహిస్తారు. వాస్తవానికి ఈ గ్రామంలో ముస్లిం కుటుంబాలు లేవు. అయినా అందుబాటులో ఉండే ముస్లిం పెద్దలు వచ్చి మదార్ సాహెబ్ సంబరం జరుపుతారు. తొలుత సాహెబ్ జెండా పట్టుకుని గ్రామ వీధుల్లో తిరిగి భక్తుల నుంచి కొబ్బరికాయలు, అగరొత్తులు, చిల్లర నాణేలు స్వీకరిస్తారు. అదే రాత్రికి మదార్ సాహెబ్ గుడారానికి చేరిన భక్తులు ఆ మత సంప్రదాయం మేరకు మూడు చొప్పున రొట్టెలు, గంధపు ఉండలు, జెండాలు, చిల్లర నాణేలు సమర్పించి పూజలో పాల్గొంటారు. హిందూ–ముస్లిం సమైక్యతతో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ క్రతువు ముగిసిన వెంటనే మద్ది రావమ్మ స్థావరానికి భక్తులు చేరుకుని వేడి నైవేద్యాలను సమర్పిస్తారు.
13వ తేదీ నుంచి ఉత్సవాలు
ఎంతో వైవిద్యంతో కూడిన ఉర్వేళమ్మ జాతర మహోత్సవాన్ని గ్రామస్తులు ఈ నెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 13న పోతురాజుస్వామి పోత తదుపరి మద్ది రావమ్మ, మదారా సాహెబ్ సంబరం జరుగుతాయి. 14న గ్రామంలో గుడారం, మదారా సాహెబ్ జెండా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో సాహెబ్ జెండా పట్టుకుని భక్తులు నడుస్తారు. చివరి రోజు 15వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఉర్వేళమ్మవారికి పూజ, రాత్రి ఏడు గంటలకు ఉర్వేళమ్మ దేవతకు వేడి నైవేద్యాలతో గ్రామస్తులు ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి పది గంటలకు ఆలయానికి చేరుకుని గ్రామంలోని 20 ముఠాల నేతృత్వంలో సంయుక్తంగా అమ్మవారి సంబరాన్ని అట్టహాసంగా జరుపుతారు.

ఉర్వేళమ్మ ఉత్సవం.. సకల జనుల సంబరం