● ప్రతి గ్రామంలో ఐదుగురితో నిఘా కమిటీ
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కాగా నిర్వహించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రతి రూపాయి ఖర్చు పారదర్శకంగా ఉండేలా సంస్కరణలు చేపట్టగా, తాజాగా నిఘా కమిటీలను నియమించాలని ఉత్త ర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీ స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో సుమారు 2.50 లక్షల జాబ్ కార్డులు ఉన్నా యి. 4.50 లక్షల మంది కూలీలుగా నమోదు చేసుకున్నారు. వీరిలో ఉపాధి పనులు చేస్తున్న వారు 2.30 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 60 వేల మంది పనులకు వెళుతున్నారు.
కమిటీ ఎంపిక ఇలా..
విజిలెన్స్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. సభ్యుల్లో సగం మంది మహిళలు ఉంటారు. ఒక ఉపాధ్యాయుడు, అంగన్వాడీ టీచర్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సోషల్ ఆడిట్ వనరుల వ్యక్తులు, విభజన సంఘాలు, సివిల్ సొసైటీ సంస్థల నుంచి సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. గ్రామసభ ద్వారా కనీసం 6 నెలల కాలానికి కమిటీని ఎన్నుకోవాలి. ఉపాధి పనులు జరిగిన వారానికి కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి. పనుల మంజూరు, నాణ్యతను అంచనా వేయడం, కూలీల హాజరు, వేతన చెల్లింపులు పారదర్శకంగా జరిగాయా లేదా తదితర వివరాలను నమోదు చేస్తారు. ఈ నివేదికలు ప్రజాపత్రాలుగా పరిగణించాలని, అవసరమైతే గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి విజిలెన్స్ కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు వచ్చాయని డీఆర్డీవో అధికారులు తెలిపారు. ఈ విషయమై త్వరలోనే గ్రామ పంచాయతీల వారీగా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సూచించారు.


