● రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
● డిచ్పల్లి ఏడో బెటాలియన్లో
రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు ప్రారంభం
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్రంలో క్రీడలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లిలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్ మైదానంలో మంగళవారం బేస్బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల, బాలికల 6వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ చాంపియన్షిప్ పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై, క్రీడాకారులను పరిచయం చేసుకొని, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి బేస్బాల్ ఆడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా రాణించి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన పలువురిని ఎమ్మెల్యే సన్మానించారు. కమాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసికోల్లాసం పెంపొందుతుందన్నారు. రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేత మాట్లాడుతూ.. పోటీలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేసి, వచ్చే నెల 24 నుంచి 28వరకు ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో జరగబోయే జాతీయ పోటీలకు పంపిస్తామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్నసాయరెడ్డి, సర్పంచ్ కోట్ల భాస్కర్, చిన్నోల్ల నర్సయ్య, రాంచందర్గౌడ్, షాదుల్లా, కార్పొరేటర్ అగ్గు భోజన్న, కార్యకర్తలు, బేస్బాల్ అసోసియేషన్ కోశాధికారి కృష్ణ, జిల్లా కార్యదర్శి సొప్పరి వినోద్ తదితరులు పాల్గొన్నారు.


