డిచ్పల్లి: క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగ చేస్తే విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని రాష్ట్ర అవార్డు గ్రహీత, గుంజీళ్ల అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్రావు తెలిపారు. తెలంగాణా యూనివర్సిటీ జాతీయ సేవా పథకం యూనిట్ 2 ఆధ్వర్యంలో మండలంలోని డిచ్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వేసవి ప్రత్యేక శిబిరంలో అందె జీవన్రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై వలంటీర్లకు అవగాహన కల్పించారు. సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని, సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీళ్ల మెరుగైన విధానమని పేర్కొన్నారు. విద్యార్థులచే గుంజీలు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన, పాఠశాలలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో ఇది ‘సూపర్ బ్రెయిన్ యోగా‘ అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని జీవన్రావు తెలిపారు. గుంజీళ్లు తీయడాన్ని శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా వలంటీర్లచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ అలీంఖాన్, అధ్యాపకులు, వలంటీర్లు పాల్గొన్నారు.


