జనగణనకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

జనగణనకు సిద్ధం

Apr 26 2026 4:57 AM | Updated on Apr 26 2026 4:57 AM

నేటి నుంచి

సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌

నిజామాబాద్‌అర్బన్‌: జనగణన–2027లో భాగంగా ఆదివారం నుంచి సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యావంతులు, ప్రజలందరూ స్వీయ నమోదు చేసు కోవాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో కోరారు. మే 10వ తేదీ వరకు https://se.census.gov. in పోర్టల్‌ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

2588 ఎన్యుమరేటర్లు..

జిల్లాలో జనగణనకు సంబంధించి 34 మండలాలకు 2,588 మంది ఎన్యుమరేటర్లను కేటాయించారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌తోపాటు మూడు మున్సిపాలిటీల్లో జనగణనకు 680 మంది ఎన్యుమరేటర్లు, 110 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వర్తించనున్నారు. వీరికి ఇది వరకు మొదటి దశ శిక్షణ పూర్తికాగా, మరో మూడు విడుతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. జనగణనలో భాగంగా మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్ల గణన చేపట్టనున్నారు. రెండవ దశ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకు జనగణన, కులగణన కొనసాగుతుంది.

ప్రశాంతంగా

‘ఓపెన్‌’ పరీక్షలు

ఖలీల్‌వాడి: జిల్లాలో ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ఐదో రోజు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో పార్శి అశోక్‌ తెలిపారు. పదో తరగతికి 12 సెంటర్లు కేటాయించగా, సాంఘిక శాస్త్రం పరీక్షకు 2,548 మందికి 2,252 మంది హాజరుకాగా 296 గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 15 సెంటర్లలో నిర్వహించిన ఇంటర్‌ హిస్టరీ పరీక్షకు మొత్తం 1,756 మందికి 1,585 మంది హాజరుకాగా, 171 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం ఉర్దూ పరీక్షకు 691 మందికి 639 హాజరుకాగా 52 మంది గైర్హాజరయ్యారు. గణిత పరీక్షకు 436 మందికి 374 మంది హాజరుకాగా 62 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి.

‘త్వరితగతిన ధాన్యం తూకం వేయాలి’

ఇందల్యాయి: నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన తూకం జరిపించి, వెంటదివెంట రైస్‌మిల్లులకు పంపించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మండలంలోని చంద్రాయన్‌పల్లి, గన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె శనివారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రైతులను పలుకరించి, ధాన్యం సేకరణ తీరుతెన్నులను అ డిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అలసత్వానికి తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. సన్నరకంతోపాటు దొడ్డు రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, దొడ్డు రకం సేకరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలలో షామియానాలు, తాగునీరు వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఎస్‌వో శ్రీకాంత్‌ రెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీఎం ప్రవీణ్‌, డీసీవో శ్రీనివాస్‌, డీఏవో వీరస్వామి, ఏఎస్‌వో అరవింద్‌ రెడ్డి, ఎంపీడీవో అనంత్‌ రావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement