● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
● ప్రారంభమైన ఎన్పీఎల్ క్రీడాపోటీలు
నిజామాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తుందని గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో శనివారం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్) క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. ప్రతి జిల్లాలో క్రీడల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును భద్రపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. క్రీడాకాలకు మరింత ప్రోత్సాహం అందిస్తే వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సీపీ సాయి చైతన్య, మేయర్ ఉమారాణి, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కన్వీనర్ కవిత రెడ్డి, రజినీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధన్పాల్.. సీపీ సాయిచైతన్య.. కవితారెడ్డి.. మేయర్ ఉమారాణి


