తెయూ(డిచ్పల్లి): విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, తద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన పెరుగుతాయని తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు. తెయూ ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ఆధ్వర్యంలో శుక్రవారం డిచ్పల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. ఈసందర్భంగా అపర్ణ మాట్లాడుతూ.. విద్యార్థులను సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే వేదికగా ఈ కార్యక్రమాలు నిలుస్తాయన్నారు. సర్పంచ్ లొక్కిడి యాదగిరి మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం తొలిరోజు వలంటీర్లు గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ప్రపంచ భూమి దినోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అలీమ్ ఖాన్, ప్రిన్సిపాల్ జి.రాంబాబు, వీడీసీ క్యాషియర్ ఆసది రవీందర్, వార్డు సభ్యులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.


