ఖలీల్వాడి: నగరంలోని జీజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.బాలమణి ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రొఫెసర్ సునీల్ కుమార్ పర్యవేక్షణలో ‘కళాశాల స్థాయి వాలీబాల్ క్రీడాకారులలో మోటార్ ఫిట్నెస్ అర్వృద్ధిపై ఎంపిక చేసిన శిక్షణా పద్ధతుల ప్రభావం‘అనే అంశంపై రాసిన పరిశోధన గ్రంథాన్ని ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రొఫెసర్ బాలమణి అందిస్తున్న సేవలను, పరిశోధనలోనూ కృషి చేయడం గొప్ప విశేషమని అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు దండుస్వామి, రంజిత, రామస్వామి, రాజేశ్, మోబిన్, నాగజ్యోతి, తబస్సుం, శ్రీలేఖ, లావణ్య, ఏవో రాంకిషన్, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో గురువారం మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన 29 పరీక్ష కేంద్రాలలో 7,008 మంది అభ్యర్థులకు 6,754 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. భీంగల్ పరీక్ష కేంద్రంలో మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్లోని పలు పరీక్ష కేంద్రాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కే సంపత్ కుమార్తో కలిసి అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్ర శేఖర్ తనిఖీ చేశారు.
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్లోని అదనపు డీసీపీ (అడ్మిన్)గా శుభం ప్రకాశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ఏఎస్పీగా పనిచేసిన శుభం ప్రకాశ్ను నిజామాబాద్ అదనపు డీసీపీగా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ సాయి చైతన్యను డీసీపీ శుభం ప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.


