ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి సమ్మె శాంతియుతంగా నిర్వహించుకోవాలి – సీపీ సాయిచైతన్య

పెంచిన పనిభారం తగ్గించాలి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఆర్టీసీ సమ్మె మొదటి రోజు ప్రశాంతంగా నడిచింది. ఉమ్మడి జిల్లాలో ఆరు బస్సు డిపోల్లో 645 బస్సులకు గాను 206 బస్సులు నడిచాయి. అద్దె ప్రాతిపదికన ఉన్న బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపించారు. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌ 1, 2, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ, కామారెడ్డి డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లో 1,585 మంది కండక్టర్లు, డ్రైవర్లు సమ్మెలోకి దిగారు. అయితే అద్దె ప్రాతిపదికన నడిచే ఎలక్ట్రిక్‌ బస్సులను అధికారులు నడిపించారు. అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడి సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గురువారం నుంచి నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ వద్ద నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. నిజామాబాద్‌ 1,2 డిపోల నుంచి నడిచే సర్వీసుల్లో కొన్నింటిని నడిపించారు. ఇదిలా ఉండగా ఆటోవాలాలు మాత్రం ఇదే అదునుగా చార్జీలు భారీగా పెంచేశారు.

● బోధన్‌ డిపోలో ఉద్యోగులు, కార్మికులు విధులకు హాజరు కాలేదు. బస్టాండ్‌ ఆవరణలో కార్మికులు నిరసన తెలిపి నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె బస్సులను ఉదయం నిలిపేశారు. ఉదయం 10 గంటల తరువాత అద్దె బస్సులు బోధన్‌ నుంచి నిజామాబాద్‌, బాన్సువాడకు 27 సర్వీసులు నడిపారు. అవుట్‌ సోర్సింగ్‌ కండక్టర్లు బస్టాండ్‌ వద్ద ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చారు. బస్టాండ్‌లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగానే ఉంది. డిపో వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

● ఆర్మూర్‌ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సమ్మె కొనసాగింది. డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా ఆర్టీసీ ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అక్కడే తిరిగారు. ఒకదశలో బస్సు బయటకు వెళుతున్న సమయంలో ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిలువరించారు. బస్సును బయటకు పంపించారు. అద్దె బస్సులతో సర్వీసులు నడిచాయి. కొన్ని బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో పురుషులు సైతం ఉచితంగా ప్రయాణాలు చేశారు.

–వందేమాతరం శ్రీనివాస్‌, టీఎంయూ

జిల్లా కార్యదర్శి

–డి సంజీవ్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌

జిల్లా నాయకులు

నిజామాబాద్‌ అర్బన్‌: ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె నిర్వహించుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు చేకూర్చొద్దని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వి ద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవల వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్‌ రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రైవేటు డ్రైవర్లు తాత్కాలికంగా వి ధుల్లోకి వచ్చినా, ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా పూర్తిస్థాయి బందోబస్తు కల్పిస్తామన్నా రు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆర్టీసీ కార్మికులకు పెంచిన పని భారం తగ్గించాలి. పెండింగ్‌ లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే ఇ వ్వాలి. మాస్టర్‌ స్కే లు అమలు చేయాలి. 18 వేల మంది రిటైర్డు అయినా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకుండా ఉన్నవారితో నెట్టుకొస్తున్నారు.

అరకొర వేతనాలతో బతుకులీడుస్తున్న ఆర్టీసీ కార్మికులను అధికారులు అడ్డగోలుగా వేధిస్తున్నారు. వేధింపులు ఆపాలి. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement