నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి నిర్వహిస్తున్న సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్న సభలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్బాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు, సంస్థకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎలక్ట్రిసిటీ బస్సులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకొని నడిపించాలని డిమాండ్ చేశారు. నాయకులు రఘురాం నాయక్, చందర్, సాయిలు, సంజీవ్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.


