● అదనపు కలెక్టర్ కిరణ్కుమార్
● నగరంలో మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహణ
నిజామాబాద్ అర్బన్: డ్రగ్స్ (మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల) నిరోధానికి విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకపై అవలంభించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. నిరంతర దాడులు కొనసాగిస్తూనే, మత్తు పదార్థాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి వాటి రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించాలని, టోల్ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని సూచించారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిజామాబాద్ జోన్ ఏసీపీ సోమనాథం, ఏసీపీ ప్రకాష్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఐఈవో రవికుమార్, ఎంవీఐ శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ భాస్కర్, సైకియాట్రిస్ట్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.


