ధర్పల్లి: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ రావు సూచించారు. ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ధర్పల్లి, సిరికొండ మండలాల పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ.. వేసవికాలం నేపథ్యంలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా ప్రణాళికబద్దంగా మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు వృథా కాకుండా గ్రామాల్లో జీపీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి ట్యాంకులకు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలన్నారు. నర్సరీలోని మొక్కలను సంరక్షించి, గతంలో నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, ఎంపీవోలు రాజేష్, తారాచంద్ , జీపీ సెక్రెటరీ లు తదితరులు పాల్గొన్నారు.


