పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి
వర్ని: అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నాణ్యత లోపిస్తే అధికారులు, కాంట్రాక్టర్పై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండలంలోని వకీల్ఫా రం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా, పీసీసీ డెలిగేట్ రాజిరెడ్డి, సర్పంచులు శ్రీనివాసరావు, బాల్ సింగ్, నాయకులు గిరి, వీర్రాజు పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయాలి
బోధన్టౌన్(బోధన్): అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పట్టణ శివారు బైపాస్ రోడ్డులో గల ఫాండు చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆదేశించారు. మంగళవారం బల్దియా కమిషనర్ జాదవ్ కృష్ణతో కలిసి పాండు చెరువు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. చెరువులోకి మురికి నీరు రాకుండా చూడాలని, వాటిని మురికి కాలువల్లోకి మళ్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డంపింగ్ యార్డులో జరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థ్ధాల ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. డీఈ యోగేష్ సిబ్బంది ఉన్నారు.
కళాకారులను ఆదుకోవాలి
నిజామాబాద్ రూరల్: కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు సిర్పలింగం అన్నారు. నగరంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులకు, ప్రమాద బీమా, ఉద్యోగ అవకాశాలు, పెన్షన్, ఇళ్ల స్థలాలు అందించాలన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రజానాట్య మండలి రాష్ట్ర మూడో మహాసభల్లో తనను రాష్ట్రకమిటీ ఉపాధ్యక్షుడిగా, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా జిల్లాకు చెందిన నర్సారెడ్డి, మహిళా విభాగంలో విజయమాలను ఎన్నుకున్నట్లు తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి
రుద్రూర్: పోతంగల్ మండలం మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక రైతులతో కలిసి వారు ఇసుక క్వారీలను పరిశీలించింనతరం అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
వేల్పూర్/ఆర్మూర్టౌన్: వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ కొల్లె నర్సయ్య, ఉపసర్పంచ్ నచ్చన్నగారి రఘు, కాంగ్రెస్ నాయకులు మంగళవారం ప్రారంభించారు. ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ వద్ద మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆర్మూర్ మున్సిపల్ వైస్చైర్మన్ కాటిపల్లి వెంకట్రెడ్డి, సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్, ఆరు పంతాల సదర్లు, పెద్దకాపులు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కర్ గంగాధర్, ఐకేపీ సీసీ లక్ష్మీ, వీవోఏలు, రైతులున్నారు.


