కమ్మర్పల్లి (భీమ్గల్): భీమ్గల్ మండలం బెజ్జోర గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి ఓ రైతు మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బెజ్జోర గ్రామానికి చెందిన సూల్ల శ్రీనివాస్ (44) అనే రైతు ఆదివారం వరి ధాన్యాన్ని ట్రాక్టర్లో నింపుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో శ్రీనివాస్ ట్రాక్టర్ కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.


