నిజామాబాద్ రూరల్: క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహించిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ బేస్బాల్ పోటీల్లో జిల్లా జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా జట్టు క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు. బేస్బాల్ బాలికల జట్టు కెప్టెన్ ఇందు నేతృత్వంలో అత్యుత్తమ ప్రదర్శనతో ఘన విజయం సాధించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కప్ ను అందుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జట్టు కోచ్ అనికేత్, బేస్బాల్ జిల్లా కార్యదర్శి వినోద్ తో పాటు సహకారం అందించిన సాఫ్ట్బాల్ జిల్లా కార్యదర్శి గంగామోహన్ ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


