ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు
● లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
● ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి
● కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ
సుభాష్నగర్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లకు శుక్రవారం ఏర్పాటుచేసిన శిక్షణాతరగతులను కలెక్టర్ సందర్శించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాల్సిన విధానంపై కీలక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున ఎంతో జాగ్రత్తతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తు.చ తప్పక పాటిస్తూ, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా పైఅధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడిలో గందరగోళానికి గురికాకూడదని, ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించుకొని వెల్లడించాలని సూచించారు. కౌంటింగ్ హాలులోనికి ఆర్వో మినహా ఇతరులు ఎవరికీ సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఒక్కో డివిజన్కు.. ఒక్కో టేబుల్..
అత్యధికంగా 60 డివిజన్లు కలిగిన నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని తెలిపారు. ఒక్కో డివిజన్కు ఒకటి చొప్పున 60 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఏక కాలంలో అన్ని డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. బ్యాలెట్ బాక్సులను తెరిచి, పోలైన ఓట్లను 25 చొప్పున బండిల్స్గా విభజిస్తూ, ఒక్కో రౌండ్లో వెయ్యి చొప్పున ఓట్లు లెక్కించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఇదే తరహాలో ఒక్కో వార్డుకు ఒకటి చొ ప్పున కౌంటింగ్ టేబుళ్లు ఉంటాయని అన్నారు. ఓ ట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ను నియమించామని అన్నారు. అ భ్యర్థులు, ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోపు కౌంటింగ్ సెంటర్ల వద్దకు రావాలని కలెక్టర్ సూచించారు. ఎంట్రీ పాసులతోపాటు ఏదైనా గుర్తింపుకార్డు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదని స్పష్టంచేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఉన్నారు.
కౌంటింగ్ కేంద్రాలు ఇవే..
పకడ్బందీ చర్యలు
శుక్రవారం ఉదయం స్ట్రాంగ్రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ, 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద డివిజన్/వార్డు వివరాలు తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు, గందరగోళానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు.


