పోలింగ్ డ్యూటీకి ఉపాధ్యాయులు
ఖలీల్వాడి: మున్సిపల్ ఎన్నికల విధులు అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు ‘పరీక్ష’గా మారాయి. జిల్లాలో 769 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 160 స్కూళ్ల టీచర్లందరికీ ఎన్నికల డ్యూ టీ పడింది. ఒక్క ధర్పల్లి మండలంలోని దాదాపు 10 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులందరూ ఎన్నికల విధులకు వెళ్లనున్నారు. అలాగే పీజీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు 450 మందికి ఎన్నికల విధులు కేటాయించారు. మార్చిలో పదో తరగతి పరీక్షలు ఉండగా హైస్కూల్ టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ వేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీవోలు, ఏపీవోలుగా 90 మంది వరకు టీచర్లను నియమించారు. పోలింగ్ డే అయిన ఈనెల 11న అలాగే ముందు రోజైన 10వ తేదీన 160 స్కూళ్లకు టీచర్లు వెళ్లే పరిస్థితి లేదు. ఎన్నికలు జరగనున్న నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పట్టణాల్లో పాఠశాలలకు బంద్ ఇచ్చినప్పటికీ.. ఎన్నికల విధులకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు వెళ్లే స్కూళ్ల పరిస్థితిపై క్లారిటీ లేదు. జిల్లాలో మొత్తం 2848 మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉండగా టీచర్లకు డ్యూటీల కేటాయింపులో నిబంధనలను పాటించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీజీహెచ్ఏంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు నిబంధనల ప్రకారం ఆర్వో, ఏఆర్వో వంటి విధులు కేటాయించాల్సి ఉండగా ఏ మాత్రం పట్టించుకోలేదని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.
పీజీహెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు
450 మంది..
పలు ప్రాథమిక పాఠశాలల
టీచర్లందరికీ ఎన్నికల విధులు
ఎన్నికలు జరగనున్న చోట్ల స్కూళ్లు బంద్
గ్రామీణ ప్రాంత బడులను
ఆ రెండు రోజులు చూసేదెవరు?


