స్టడీ టూర్లను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● రాష్ట్రపతి భవన్లో ఉద్యాన్ ఉత్సవ్కు తరలిన మోపాల్ విద్యార్థినులు
నిజామాబాద్ అర్బన్: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఉద్యాన్ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్టడీ టూర్ (అధ్యయన యాత్ర)ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు సూచించారు. సికింద్రాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్న ఉద్యాన్ ఉత్సవ్లో ప్రదర్శనలను తిలకించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం తరపున మోపాల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 52మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక బస్సులో రాష్ట్రపతి భవన్కు పంపించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థినులు వెళ్తున్న బస్సుకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యాన ఉత్సవ్లో ఎన్నో రకాల పుష్పాలు, మొక్కలను ప్రదర్శనలో ఉంచుతారని, వాటి గురించి అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. డీఈవో అశోక్, ఉద్యానవన శాఖ ఏపీడీ భారతి తదితరులు పాల్గొన్నారు.


