
గోదావరిలోకి కొనసాగుతున్న నీటి విడుదల
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుండటంతో ఎస్సారెస్పీ నుంచి వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. 16 గేట్ల ద్వారా 49,250 క్యూసెక్కుల నీరు పోతుండగా, 78వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. వరద కాలువ ద్వారా 20 వేలు, కాకతీయ కాలువకు 3500, ఎస్కెప్ గేట్ల ద్వారా 4500, సరస్వతి కాలువకు 500, లక్ష్మి కాలువకు 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 651 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1090.70(79.26 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.
పెరిగిన విద్యుదుత్పత్తి..
ప్రాజెక్ట్ వద్ద గల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. నాలుగు టర్బాయిన్ల ద్వారా 36.4 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 8.97 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు జెన్కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు.