
శిలాఫలకం ధ్వంసం
● పోలీసులకు ఫిర్యాదు
నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రానికి సమీపంలోని పలుగుట్ట ప్రాంతంలో మండల రజక సంఘం కల్యాణ మండప నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ మేరకు రజక సంఘం సభ్యులు గురువారం ఆందోళన చేపట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షుడు గవాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి రజకుల కల్యాణ మండపం కోసం ఎకరం భూమి కేటాయించి రూ. 20 లక్షల ప్రొసీడింగ్తో మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి భూమిపూజ చేశారని తెలిపారు. శిలాఫలాకాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
గాంధారి(ఎల్లారెడ్డి): అదుపు తప్పి ఆటో బోల్తా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని మేడిపల్లి సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, అంబులెన్సు సిబ్బంది ఈఎంటీ సురేశ్, పైలట్ ప్రకాశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆరిఫ్ కుటుంబసభ్యులతో బడాపహాడ్ దర్శనం కోసం ఆటోలో బయల్దేరారు. గాంధారి– బాన్సువాడ ప్రధాన రహదారిలో బుగ్గగండి ప్రాంతంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. దీంతో ఆటో నడుపుతున్న ఆరిఫ్తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, గండివేట్ మాజీ సర్పంచ్ ఫారూఖ్ 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చి అంబులెన్సులో ఎక్కించారు. ఆరిఫ్తోపాటు చిన్నారులు అమ్రాన్, అర్ఫాన్, షరీనా, షాబీనాకు తీవ్రగాయాలు కాగా మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయం చేసిన మాజీ సర్పంచ్ ఫారూఖ్ను పలువురు అభినందించారు.
పోలీసులకు పట్టించారని దాడి
ఖలీల్వాడి: పోలీసులకు పట్టించారంటూ యూత్ సభ్యులపై దాడి చేసిన వ్యక్తులను రిమాండ్కు తరలించినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గౌతమ్ నగర్ చెందిన షేక్ అబ్దుల్ గఫార్, అతని మిత్రులు షేక్ అవేజ్, మహేశ్, సచిన్ కలిసి బుధవారం రాత్రి యూత్ సభ్యులపై ఇటుకలు, కర్రలతో దాడి చేశారన్నారు. గఫార్ గత నెలలో గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడడంతో గౌతమ్నగర్ చెందిన వారే పోలీసులకు పట్టించారనే అనుమానంతో యూత్ సభ్యులపై కక్షగట్టి రాత్రి దాడి చేసినట్లు తెలిపారు. గఫార్, అతని మిత్రులపై కేసు నమోదు చేసి ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. గఫార్తోపాటు అతని మిత్రులపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు.

శిలాఫలకం ధ్వంసం