
పోలీసులకు పట్టిస్తాడనే భయంతోనే చంపేశాడు
హత్య కేసులో ఒకరి రిమాండ్
ఖలీల్వాడి: బైక్ దొంగతనం చేసిన తనను పోలీసులకు ఎక్కడ పట్టిస్తాడోననే భయంతో పాంగ్రా శివారులో ఒకరిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నగర సీఐ శ్రీనివాస్ రాజు తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. నాల్గో టౌన్ పరిధిలోని సంజీవ్రెడ్డి కాలనీకి చెందిన వసంత్కుమార్ అలియాస్ టిల్లు(38), గాజులపేట్కు చెందిన సర్దార్ తేజసింగ్ అలియాస్ దయాసింగ్ స్నేహితులు. వసంత్కుమార్ ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తుండగా, తేజసింగ్ జులాయిగా తిరిగేవాడు. జల్సాలకు డబ్బులు అవసరమై తేజ్సింగ్ ఈ నెల 7న గంగస్థాన్ ఫేస్–2లో ఓ బైక్ను దొంగిలించాడు. ఆ బైక్ను అమ్మేందుకు ఈ నెల 9న సాయంత్రం వసంత్కుమార్కు ఫోన్ చేసి రూ.25 వేలు అవసరం ఉంది, బైక్పై లోన్ ఇప్పించాలని అడిగాడు. దీంతో వసంత్కుమార్ బైక్ ఆర్సీ, ఆధార్ తీసుకొని వస్తే మూడు రోజుల్లో లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. తేజ్సింగ్ బైక్ తన పేరు మీద లేదని వేరే వాళ్లదని, అర్జెంటుగా డబ్బులు కావాలని బతిమిలాడగా, బైక్ను తాకట్టు పెట్టుకొని రూ.3 వేలు ఇస్తానని వసంత్కుమార్ తెలిపాడు. దీంతో ఇద్దరూ కలిసి పాంగ్రా శివారులో మద్యం సేవించేందుకు వెళ్లారు. అక్కడ డబ్బులు ఇచ్చిన వసంత్కుమార్ బైక్ పేపర్లు ఇవ్వాలని తేజ్సింగ్ను అడగడంతో సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానం వచ్చి దొంగిలించిన బైక్ను తాకట్టు పెడుతున్నావా? అని తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలనడంతో తర్వాత ఇస్తానని తేజ్సింగ్ చెప్పాడు. దీంతో వసంత్కుమార్ బైక్ ఎక్కడ దొంగతనం చేశావు, పోలీసులకు చెప్తానని అన్నాడు. భయపడిన తేజ్సింగ్ పక్కనే ఉన్న బండరాళ్లతో తల, ముఖంపై దాడి చేయడంతో వసంత్కుమార్ అక్కడిక్కకడే మృతి చెందాడు. 10న గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకొని సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు వసంత్కుమార్ అలియాస్ టిల్లుగా గుర్తించి విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు. గురువారం పాంగ్రా గ్రామ శివారులో దొంగిలించిన మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న తేజ్సింగ్ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయి, బైక్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఛేదించిన సీఐ శ్రీనివాస్రాజ్, నాల్గో టౌన్ ఎస్సై కే శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.