గుర్తింపు లేని పాఠశాల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

గుర్తింపు లేని పాఠశాల సీజ్‌

Jun 14 2025 10:10 AM | Updated on Jun 14 2025 10:26 AM

పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి వేంకటేశ్వర కాలనీలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న హ్యాపీ కిడ్స్‌ పాఠశాలను ఎంఈవో రాజగంగారాం శుక్రవారం సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేని పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించొద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రకటనలను చేసి మోసపోవద్దని, నాణ్యమైన విద్యనందించే పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలన్నారు.

రెండు గూడ్స్‌ వాహనాలు..

ఆర్మూర్‌టౌన్‌: ఫిట్‌నెస్‌, పర్మిట్‌ లేని రెండు గూడ్స్‌ వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎంవీఐ వివేకానందరెడ్డి తెలిపారు. ఆర్మూర్‌తోపాటు మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌ ప్రాంతాల్లో ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను, గూడ్స్‌ వాహనాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ.. వాహనదారులు సరైన సమయంలో ఫిట్‌నెస్‌, ఇన్సురెన్స్‌, టాక్స్‌ చెల్లించాలని, లేనిపక్షంలో సీజ్‌ చేయడం జరుగుతుందన్నారు. సీజ్‌ చేసిన రెండు గూడ్స్‌ వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనిఖీలో ఆర్టీఏ సిబ్బంది మనోజ్‌, దశరథ్‌ పాల్గొన్నారు.

శ్రీ చైతన్యకు అనుమతి లేదు

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డులో నూతనంగా నిర్మించిన భవనంలో శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోందని, ఆ పాఠశాలకు ఎలాంటి అనుమతి లేదని నిజామాబాద్‌ రూరల్‌ మండల విద్యాశాఖ అధికారి సేవల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలలో తమ పిల్లలకు అడ్మిషన్లు తీసుకోవద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు.

హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలుశిక్ష

నిజామాబాద్‌ లీగల్‌: హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ సీనియర్‌ సివిల్‌ జడ్జి పి సాయిసుధ తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్‌ నగరంలోని గౌతంనగర్‌కు చెందిన రేణుకకు పోచమ్మగల్లీకి చెందిన మద్దికుంట వెంకటితో వివాహమైంది. గొడవ కారణంగా రేణుక తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. అదే ఇంట్లో రేణుక అక్కయ్య అనుపమ సైతం ఉంటోంది. మరో వైపు రెండో పెళ్ళిచేసుకున్న వెంకటి తన పిల్లలను చూసేందుకు 2017 జనవరి 17న అత్తవారింటికి వచ్చాడు. వెంకటితో మాట్లాడేందుకు పిల్లలు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు అత్త లక్ష్మి, వదిన అనుపమపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితులు మూడో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును విచారించిన సీనియర్‌ సివిల్‌ జడ్జి ఐపీసీ 307 సెక్షన్‌ ప్రకారం నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూటర్‌గా డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ పి లక్ష్మీనర్సయ్య వ్యవహరించారు.

స్వగ్రామానికి చేరిన గల్ఫ్‌ మృతదేహం

డిచ్‌పల్లి: మండలంలోని మిట్టపల్లికి చెందిన సిర్నాపల్లి గంగాధర్‌(40) కువైట్‌లో సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరగా, తల్లిదండ్రులు లక్ష్మి, చిన్న గంగారాంతోపాటు భార్య సుజాత, కూతుళ్లు, కొడుకు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబీకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు గంగాధర్‌ అంత్యక్రియలను పూర్తి చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గుర్తింపు లేని పాఠశాల సీజ్‌1
1/1

గుర్తింపు లేని పాఠశాల సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement