నిజామాబాద్ నాగారం: జిల్లాలో యూనిసెఫ్ బృందం పర్యటన ముగిసింది. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయాన్ని గురువారం సందర్శించి పలు విషయాలపై చర్చించారు. యూనిసెఫ్ బృందం సభ్యులు న్యూట్రిషన్ స్పెషలిస్టు డాక్టర్ ఖ్యాతి తివారి, న్యూట్రిషన్ ఆఫీసర్ రేషా నికుంజ దేశాయి, నరసింహారావులు డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తుకారం రాథోడ్తో సమీక్షించారు. మొదటిరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిర్మన్పల్లి, గన్నారం గ్రామాల్లో పర్యటించి పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులకు అందించే సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రాల పనితీరును మెచ్చుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వచ్చే నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు సామ్ మామ్ చిల్డ్రన్స్కు అందించే స్పెషల్ సప్లమెంటరీ ఫీడింగ్పై శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపరింటెండెంట్ ఇందిరా, న్యూట్రిషన్ విభాగం అధికారి రాంబాబు హాజరయ్యారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
బోధన్టౌన్(బోధన్): నిర్దేశిత మెనూ ప్రకారం రోగులకు భోజనాన్ని అందించాలని జిల్లా డైట్ టాస్క్ఫోర్స్ బృందం అధికారులు సూచించారు. బోధన్లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో జిల్లా డైట్ టాస్క్ఫోర్స్ బృందం గురువారం భోజనాన్ని తనిఖీ చేసింది. వంట గదితోపాటు కూరగాయలను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చి అడ్మిట్ ఉన్న రోగులకు అందిస్తున్న భోజన మెనూ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగుల వద్దకు వెళ్లి నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని వాకబు చేశారు. తనిఖీల్లో డాక్టర్ వెంకటేశ్, పోగ్రాం అధికారి నారాయణ, సిబ్బంది ఉన్నారు.
బ్యాంకు లింకేజీలో జిల్లాకు ఉత్తమ అవార్డు
● మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందుకున్న డీఆర్డీవో
డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసినందుకు నిజామాబాద్ జిల్లాకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. హైదరాబాద్లో గురువారం జరిగిన నూతన వార్షిక ప్రణాళిక ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్డీవో సాయాగౌడ్ అవార్డును అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.1228.71 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు 16,060 మహిళా సంఘాలకు రూ.1320.73 కోట్ల రుణాలను (107.49 శాతం) అందించారు. డీపీఎం నీలిమాకు ఉత్తమ ఎంప్లాయీ అవార్డు కూడా వచ్చింది.
రూ.30వేలకు చేరువలో ఆమ్చూర్
సుభాష్నగర్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో ఆమ్చూర్ ధర అమాంతం పెరిగి రూ.30 వేలకు చేరుకుంది. గురువారం క్వింటాలుకు రూ.29,500 పలికి ఈ సీజన్లో అత్యధిక ధరగా నమోదైంది. బుధవారం వరకు రూ.25 వేలకు దిగువన పలికిన ఆమ్చూర్ ఏకంగా రూ.5వేలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్యార్డుకు గురువారం 223 క్వింటాళ్ల పంట వచ్చింది. జిల్లాతోపాటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, కామారెడ్డి, ఇతర జిల్లాల నుంచి ఆమ్చూర్ను శ్రద్ధానంద్ గంజ్కు తీసుకొస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా నిజామాబాద్ మార్కెట్ యార్డులోనే ఆమ్చూర్ పంట క్రయవిక్రయాలు జరుగుతాయి.

ముగిసిన యూనిసెఫ్ బృందం క్షేత్ర పర్యటన