
పది ఫలితాల్లో కేజీబీవీల సత్తా
ఆర్మూర్: బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో విద్యార్థినులు పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చారు. జిల్లా వ్యాప్తంగా 19 కేజీబీవీల్లో వంద శాతం ఫలితాలను సాధించి కేజీబీవీ రికార్డులను తిరగరాసారు. నిజామాబాద్ జిల్లాలోని 27 కేజీబీవీలను తెలంగాణ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నార్త్, సౌత్ కేజీబీవీల్లో 8వ తరగతి వరకు మాత్రమే ఉండటంతో మిగిలిన 25 కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం 1,020 మంది బాలికలు పదో తరగతి పరీక్షలు రాయగా అందులో 1,001 మంది ఉత్తీర్ణత సాధించగా 19 మంది విద్యార్థినులు ఫెయిల్ అయ్యారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల్లో 98.13 శాతం ఉత్తీర్ణత నమోదైందని డీఈవో అశోక్, సెక్టోరల్ ఆఫీసర్ (జీసీడీవో) భాగ్యలక్ష్మి తెలిపారు.
టాపర్ మార్కులు 577..
ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, కమ్మర్పల్లి, మాక్లూర్, మెండోరా, మోర్తాడ్, మోపాల్, ముప్కాల్, నవీపేట్, నిజామాబాద్, రుద్రూర్, సిరికొండ, వేల్పూర్, ఏర్గట్ల కేజీబీవీల్లో బాలికలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించారు. రుద్రూర్ పాఠశాల విద్యార్థిని గోగుర్ల శివాణి 577 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. కాగా నందిపేట కేజీబీవీలో 80.64 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. ఈ పాఠశాలలో 31 మంది విద్యార్థినిలు పరీక్ష రాయగా 25 మంది పాస్ అయ్యారు.
జిల్లా వ్యాప్తంగా 25 విద్యాలయాల్లో కలిపి 98.13 శాతం ఉత్తీర్ణత
వచ్చే ఏడాది వంద శాతం ఫలితాలు సాధిస్తాం
జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినులు పదో తరగతి పరీక్షల్లో చక్కని ఫలితాలను సాధించారు. రానున్న విద్యా సంవత్సరంలో కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి సారించి, వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్, డీఈవో సూచన మేరకు ఇప్పటికే అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం.
– భాగ్యలక్ష్మి, సెక్టోరల్ ఆఫీసర్, నిజామాబాద్

పది ఫలితాల్లో కేజీబీవీల సత్తా