● ఏఎంసీ అధికారుల చోద్యం ● ట్రేడర్ల సూచనతో ఒకరోజు బీట్‌ బంద్‌ ● ఎండల తీవ్రత సాకుతో మూత | - | Sakshi
Sakshi News home page

● ఏఎంసీ అధికారుల చోద్యం ● ట్రేడర్ల సూచనతో ఒకరోజు బీట్‌ బంద్‌ ● ఎండల తీవ్రత సాకుతో మూత

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

● ఏఎంసీ అధికారుల చోద్యం ● ట్రేడర్ల సూచనతో ఒకరోజు బీట్‌ బంద్‌ ● ఎండల తీవ్రత సాకుతో మూత

జూన్‌ 2న కుమురంభీం జిల్లాకు రేవంత్‌రెడ్డి

భైంసాటౌన్‌: భైంసాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు వ్యాపారులకు వంతపాడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గాంధీగంజ్‌లో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్ల మధ్య నెలకొన్న విబేధాలకు రైతులను బలి చేస్తున్నారు. అసలే అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తే, విక్రయానికీ అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని గాంధీగంజ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయానికి తేగా, ట్రేడర్లు మధ్యాహ్నం వరకు బీట్‌ ప్రారంభించలేదు. దీంతో రైతులు ఎండలో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్‌ ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రైతుల నుంచి కమీషన్‌ ఏజెంట్ల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే ట్రేడర్లు డబ్బు చెల్లించే విషయమై విబేధాల కారణంగా కొనుగోళ్లు నిలిపేసినట్లు తెలిసింది. దీంతోపాటు హమాలీలు, లారీలు, గన్నీ సంచులు లేవంటూ కొనుగోళ్లు చేపట్టలేదని కార్యదర్శితో ట్రేడర్లు చెప్పుకొచ్చారు. అయితే, ప్రస్తుతానికి వచ్చిన లాట్లు కొనుగోలు చేసి, రేపటి నుంచి ట్రేడింగ్‌ చేయబోమని లిఖితపూర్వకంగా పత్రం ఇవ్వాలని కోరారు. దీంతో వారు కొనుగోళ్లకు బలవంతం చేస్తున్నారని కార్యదర్శినే దబాయించే ప్రయత్నం చేశారు. దీనిపై కార్యదర్శి స్పందిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. దీంతో ప్రస్తుతానికి కొనుగోలు చేస్తామని, కానీ, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు బుధవారం తాత్కాలికంగా ఒకరోజు బీట్‌ నిలిపేయాలని ఏఎంసీ కార్యదర్శిని మౌఖికంగా కోరారు.

తప్పుడు ప్రకటన...

ఇదిలా ఉండగా, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్ల మధ్య విబేధాలను పరిష్కరించి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాల్సిన ఏఎంసీ అధికారులు వ్యాపారులకు వంతపాడేలా, రైతులను ఇబ్బందులకు గురి చేసేలా తప్పుడు ప్రకటన చేయడం గమనార్హం. తీవ్రమైన ఎండల నేపథ్యంలో రైతుల ఆరోగ్య దృష్ట్యా అంటూ బుధవారం బీట్‌ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇది రైతులను తప్పుదోవ పట్టించడమేనని తెలుస్తోంది. ఈ విషయమై ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement