ముఖ్యమంత్రి పర్యటనలో మార్పు | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పర్యటనలో మార్పు

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

జూన్‌ 2న కుమురంభీం జిల్లాకు రేవంత్‌రెడ్డి

ఆసిఫాబాద్‌/కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ జూన్‌ 2న సీఎం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బుధవారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి ప్రత్యేక కార్యదర్శి కాసుల నానిల్‌ కుమార్‌ తెలిపారు. మంత్రులు మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. అనంతరం సీఎం బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌, వంజిరీ దాదానగర్‌ ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement