నిర్మల్ఖిల్లా: జిల్లాలో ధాన్యం నిల్వకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెనువెంటనే గోదాములకు తరలించాలని చెప్పా రు. ముందస్తు జాగ్రత్త చర్యగా అదనంగా, ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు సమకూర్చుకోవాలన్నారు. ఇతర జిల్లాల్లో గోదాములు అందుబాటులో ఉంటే, గుర్తించి ధాన్యం అక్కడికి తరలించాలని వివరించారు. ధాన్యం నిరంతరాయంగా తరలించేలా తగినన్ని లారీలు, తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, మార్క్ఫెడ్ డీఎం మహేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక తవ్వకాలు నియంత్రించాలి..
జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు పూర్తి స్థాయిలో నియంత్రించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక రీచ్లను గుర్తించాలన్నారు. కేవలం మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాలు పారదర్శకంగా జరగాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, భూగర్భ జల అధికారి శ్రీనివాసబాబు, డీపీవో శ్రీనివాస్, రాయల్టీ ఇన్స్పెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.


