ఉమ్మడి రాష్ట్రంలో 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించి రూ.64 వేల కోట్లు అప్పు చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారు. అయినా అభివృద్ధి, సంక్షేమాన్ని ఏ రోజూ ఆపలేదు. జిల్లాలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే విమానాయశ్రయం పనులు ప్రారంభిస్తాం. పారిశ్రామి కంగా అభివృద్ధి చేయడంతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. భట్టి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీఅమలు చేయడం సంతోషంగా ఉంది.
– జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి
సీఎం రావడం సంతోషం..
1983లో ఎన్టీఆర్ సీఎం హోదాలో తొలిసారి మా మండలానికి వచ్చారు. మళ్లీ 26 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రావడం ఆనందంగా ఉంది. బోథ్లో మినీ స్టేడియం మంజూరు చేయాలి. రూ.18 కోట్లతో చేపట్టిన భీంపూర్– కరంజీ అంతర్రాష్ట్ర రోడ్డును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలి. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను పిప్రిలోనే ఏర్పాటు చేయాలి. జిల్లాను ప్రత్యేకంగా పరిగణిస్తూ ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ పరిధిలోని పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి.
– గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్


