● సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
భైంసా/బాసర: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా బాసర మాస్టర్ ప్లాన్కు రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కలిసి శుక్రవారం సాయంత్రం బాసరకు చేరుకున్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీషర్మిల పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులను వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత స్థానిక రాజన్న అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. బాసర ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏర్పాట్లపై సమీక్ష...
సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించారు. బాసర ఆలయ ప్రాంగణం, గర్భగుడి, కోనేరు, ప్రధాన ద్వారాలు పరిశీలించారు. మాస్టర్ ప్లాన్పై కలెక్టర్ అభిలాష అభినవ్ ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు మ్యాప్ అందించారు. గతంలో రూపొందించిన మాస్టర్ప్లాన్లో కొద్దిపాటి మార్పులు చేశారు. సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్న ప్రదేశాలను మంత్రులు పరిశీలించారు.


