వీడని పీఠం ముడి
నిర్మల్/భైంసా: మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని భైంసా, ఖానాపూర్ ఓటర్లు ఇచ్చిన వినూత్న తీర్పు పార్టీలకు పరీక్ష పెట్టింది. రెండు పార్టీలు చేతులు కలపకుండా పాలకవర్గాలు కొలువుదీరే పరిస్థితి లేదు. ప్రతీ పార్టీకి పీఠంపైనే దృష్టి. చైర్మన్గిరీ ఇస్తేనే మద్దతిస్తామని భీష్మించుకుని క్యాంపుల్లోనే ఉన్నా రు. ఆ పార్టీతో కలిస్తే ఏమవుతుందో, ఈ పార్టీ మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుందో.. అని ఎటూ తేలని లెక్కల్లోనే సమయం మించిపోతోంది. పాలకవర్గాలు కొలువుదీరే వేళయింది. జిల్లాలోని మూ డు మున్సిపాలిటీల్లో సోమవారం చైర్మన్, వైస్చైర్మన్, కౌన్సిలర్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. నిర్మల్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా అప్పాల కావ్యను ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్ శ్రేణులు, గణేశ్చక్రవర్తి అనుచరులు నిర్మల్లో శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు.
చైర్మన్ కోసమే ‘ఖానాపూర్’ పట్టు..
‘మా పార్టీ అభ్యర్థికి చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతిస్తం..’ ఖానాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలదీ ఇదే వాదన. ప్రమాణ స్వీకారానికి వేళయినా బెట్టు వీడకుండా పీఠంపైనే పట్టుపడుతున్నారు. మొత్తం 12 వార్డుల్లో మూడు ప్రధాన పార్టీల దగ్గర నాలుగు చొప్పున ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 7కు ఏ పార్టీ దరిదాపుల్లో లేదు. ఇక్క డ రెండు పార్టీలు కలిస్తేనే పాలకవర్గం ఏర్పడుతుంది. కానీ.. ఆ రెండు పార్టీలేవో తేల్చుకోవడం లేదు.
నిర్మల్లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు..
నిర్మల్ మున్సిపాలిటీలో చైర్మన్, ఎన్నుకునే వైస్చైర్మన్, కౌన్సిలందరితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు స్థానిక మున్సిపాలిటీ ఎదుట వేదిక ఏర్పాటు చేశారు. కార్యాలయంలోనూ చైర్మన్ చాంబర్, కౌన్సిల్ హాల్ను తీర్చిదిద్దారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, డీపీవో శ్రీనివాస్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైస్చైర్మన్గా అప్పాల గణేశ్చక్రవర్తినే ఎన్నుకోనున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.


