
ఉపాధ్యాయుల్లో ‘టెట్’షన్
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకా లకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) అర్హత త ప్పనిసరి. ఈ తీర్పు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉ పాధ్యాయులకు కూడా వర్తిస్తుందా అనే సందేహాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతున్నాయి. గతంలో టెట్ అర్హత లేకుండా నియమితులైన ఉపాధ్యాయులు తాజాగా సు ప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో 2,600 మందికిపైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామందికి టెట్ అర్హత లేదు. దీంతో తమకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం, విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పదోన్నతులు పొందిన లేదా పొందబోయే ఉపాధ్యాయులు కూడా నిర్ణీత గడువులో టెట్ అర్హత సాధించాలని తీర్పు రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సుప్రీం తీర్పును యువత స్వాగతిస్తోంది.
టెట్ అర్హత తప్పనిసరి..
సుప్రీంకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. లేనిపక్షంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే, పదవీ విరమణకు ఐదేళ్లలోపు సమయం ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారు పదోన్నతుల అర్హత కోసం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ఆర్టీఈ–2010 నిబంధనల ప్రకారం టెట్ తప్పనిసరి చేయగా, ఉమ్మడి రాష్ట్రంలో 2012 డీఎస్సీ పరీక్షలో ఈ నిబంధన అమలైంది.
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు..
ప్రస్తుత ఉపాధ్యాయుల సేవలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టెట్ అర్హతపై సడలింపులు లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలు అవసరమని వారు ఒత్తిడి చేస్తున్నారు.
మినహాయింపునివ్వాలి...
2012కు ముందు ఉద్యోగాలలో చేరిన ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో సైతం మినహాయింపు నిచ్చేలా ఆలోచన చేయాలి. అవసరమైతే వృత్యంతర శిక్షణ ద్వారా గుణాత్మక విద్యా బోధన కోసం ఉపాధ్యాయుల్లో నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రప్రభుత్వం, విద్యాశాఖ చర్యలు చేపట్టాలి..
– తొడిశెట్టి రవికాంత్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
సుప్రీం తీర్పు శిరోధార్యమే...
మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా వృత్తిలో చేరేవారు, ఇదివరకే ఉపాధ్యాయులుగా ఉన్నవారికి సైతం టెట్ అర్హత కచ్చితంగా అవసరమన్న సుప్రీం తీర్పు శిరోధార్యమే. అన్ని వృత్తులలో కన్నా ఉపాధ్యాయ వృత్తిలో కాలాలనుగుణ మార్పులను స్వాగతించాలి.
– పి.వంశీకృష్ణ , చించోలి(బి), సారంగాపూర్
తీర్పును పునఃసమీక్షించాలి...
దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. ఐదేళ్ల పైబడి సర్వీసు కలిగిన ఇన్సర్వీస్ ఉపాధ్యాయులందరూ రెండేళ్ల వ్యవధిలో టెట్ అర్హత సాధించాలన్న తీర్పును పునఃసమీక్షించాలి.
– భూమన్నయాదవ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

ఉపాధ్యాయుల్లో ‘టెట్’షన్

ఉపాధ్యాయుల్లో ‘టెట్’షన్

ఉపాధ్యాయుల్లో ‘టెట్’షన్